
మూడు రాజధానుల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ కుమార్ పేర్కొన్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 19వ తేదీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అయన మాట్లాడారు. అనంతరం కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం సరైందని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమని పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును రాష్ట్ర ప్రజలంతా అంగీకరిస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదికను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, సారవంతమైన భూముల్లో రాజధాని నిర్మాణంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని, అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు చేరువయ్యారని, అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలను అమలు చేసారని తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉన్నామని, అమరావతి అభివృద్ధికి రూ. కోట్లు ఖర్చుపెడితే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన రాయలసీమ వాసుల్లో ఉందన్నారు. లోటు బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తుండడం చూసి ప్రతిపక్షానికి అసూయ కలుగుతుందని పేర్కొన్నారు. విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిని చేయడం వల్ల అతి తక్కువ కాలంలోనే దేశంలోని ఇతర రాజధానులకు దీటుగా అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. Κεντρο Luxorion
