చేనేత కుటుంబాలకు అండగా.. – ఆర్థిక సాయం చేసిన వీవర్స్ వెల్ఫేర్‌ ట్రస్ట్ సభ్యులు – బాధితులను పరామర్శించిన అఖిల భారత పద్మశాలీ సంఘం ఇంజనీరింగ్‌ విభాగం నాయకులు

ఆర్థిక ఇబ్బందులతో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. కూతుర్లు పెద్ద దిక్కును కోల్పోయారు. అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చారు వీవర్స్ వెల్ఫేర్‌ ట్రస్ట్ సభ్యులు, అఖిల భారత పద్మశాలీ సంఘం ఇంజనీరింగ్‌ విభాగం నాయకులు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న వెల్లంకి వాసికి వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పద్మ బ్రాహ్మణుడిని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు.

రాణి కుటుంబానికి ఆర్థిక సాయం

ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల జనగాం పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న ఎనగందుల రాణి కుటుంబాన్ని వీవర్స్ వెల్ఫేర్‌ ట్రస్ట్ చైర్మన్‌ బర్రెంకల మధుసూదన్‌ సూచన మేరకు ట్రస్ట్ కోశాధికారి కందగట్ల స్వామి, సామాజిక విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్‌ మే 19వతేదీ పరామర్శించారు. రూ. 5 వేలు నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. సాయి వెంకటేశం చారిటబుల్‌ ట్రస్టు తరుపున అఖిల భారత పద్మశాలి సంఘ మహిళ విభాగం అధ్యక్షురాలు దుష్యంతల రూ. 5 వేల చెక్కు అందజేశారు. రాణి కూతుర్ల ఉన్నత చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అఖిల భారత పద్మశాలీ సంఘం ఇంజనీరింగ్‌ విభాగం  నాయకులు  కాచర్ల రాజ్‌ కుమార్‌, ఇడెమ్‌ భాను ప్రసాద్‌  కలిసి రూ.2 వేలు అందజేశారు. అదే కాలనీలో వివిధ కారణాలతో గతంలో మృతి చెందిన నాలుగు చేనేత కుటుంబాలకు అఖిల భారత పద్మశాలి సంఘం ఇంజనీరింగ్‌ విభాగం జాతీయ అధ్యక్షులు పుట్ట పాండు రంగయ్య, ఉపాధ్యక్షులు రాజ్‌ కుమార్‌, కోశాధికారి చిలుకూరు చంద్రమౌళి రూ. 3 వేలు అందజేశారు. వీవర్స్ వెల్ఫేర్‌ ట్రస్ట్ తరుపున ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందజేశారు.

క్షతగ్రాతుడికి ఆర్థిక సాయం

పద్మ బ్రాహ్మణుడు పెన్నాం ప్రసాద్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఇంజనీరింగ్‌ విభాగం సభ్యులు అయనను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. రూ. 3 వేల నగదు అందజేశారు. వీవర్స్ వెల్ఫేర్‌ ట్రస్ట్ తరుపున 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందజేశారు.

వెల్లంకి గ్రామ నివాసి సాయికి ..

వెల్లంకి గ్రామ నివాసి తాటి సాయి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. వనం దుష్యంతల, గుంటక రూప, కాచర్ల రాజ్‌ కుమార్‌ ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. రూ. 3వేలు, 25 కిలోల బియ్యం, నిత్యావసరాలను అందజేశారు. సాయి వైద్యఖర్చుకు సహకరిస్తానని రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఎవరూ కూడా మనోధైర్యం కోల్పోవద్దని, తాము అండగా ఉంటామని ట్రస్టు సభ్యులు, ఇంజనీరింగ్‌ విభాగం నాయకులు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలు, బాధితులు, క్షతగాత్రులను ఆదుకున్న దాతలు, అఖిల భారత పద్మశాలీ  యువజన సంఘం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్‌కు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు గుర్రం నాగరాజు ధన్యవాదాలు తెలిపారు. బాధితులను పరామర్శించిన వారిలో ఎనగందుల కృష్ణ, పిట్టల సత్యం, చింతకింది నరేష్‌, కాముని వేణు ఉన్నారు.

చేనేతలకు సేవా కార్యక్రమాలు, వారి సమస్యలు, పరిష్కార మార్గాలను వాట్సప్‌ నంబర్‌ 83338 71117కు పంపండి. www.chenetamitra.comలో వీక్షించండి. Zenvaultex

Follow us on social media

Related posts

Leave a Comment