ఆయన వృత్తి బోధన. ప్రవృత్తి సామాజిక సేవ. కులాభిమానంతో పోపాకు ఎంతో సేవ చేశారు. ఐదుసార్లు అధ్యక్షులుగా కొనసాగారు. అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. కులస్థుల అభ్యున్నతికి ఎంతో పరితపించేవారు. ఆయనే భీమనిపల్లె గురుస్వామి గారు.
వీరి స్వగ్రామం కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలోని వేల్పనూరు గ్రామం. భీమనిపల్లె అంకన్న, అచ్చమ్మ దంపతులకు జూలై 26,1939న జన్మించారు. వీరి మేనమామ దివంగత నారాయణ చిన్న బాలన్న (నంద్యాల). గురుస్వామి గారి ప్రాథమిక విద్య వేల్పనూరులో, హైస్కూలు విద్య కర్నూలులోని మునిసిపల్ హైస్కూల్లో కొనసాగింది. హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకాం, శ్రీ కృష్ణ దేవరాయ (అనంతపురం) యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేశారు. కామర్స్ లెక్చరర్గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. 1974 నుంచి 1997 వరకు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో, కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో విధులు నిర్వహించారు. 1997లో కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో రిటైరయ్యారు.
అధ్యక్ష హోదాలో పోపాకు సేవలు..
సామాజిక సేవలో ముందుండే గురుస్వామి (81) గారికి పద్మశాలీ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా)తో ఎంతో అనుబంధం ఉంది. అసోసియేషన్ ఆవిర్భావం నుంచి పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1987 నుంచి 1991 వరకు, 1991 నుంచి 1995 వరకు, 1995 నుంచి 2000 సంవత్సరం వరకు, 2003 నుంచి 2006 వరకు, 2009 నుంచి 2010 వరకు పోపా అధ్యక్షులుగా కొనసాగారు. ఐదు సార్లు అధ్యక్షులుగా ఉండి పోపాను ముందుకు నడిపించారు.
2012 పోపా డైరెక్టరీ ముద్రణకు ఎంతో కృషి చేశారు. వివిధ స్థాయిలో ఉన్న ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్, ఉద్యోగుల వివరాలను చాలా ఓపికగా సేకరించారు. ఏటా చదువులో రాణించిన పద్మశాలీ విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాల నిర్వహణకు ఆయన సూచనలను కార్యవర్గం పాటించేది. కార్యవర్గ, సర్వసభ్య సమావేశాల్లో పలు సూచనలు చేసేవారు. సలహాలు ఇచ్చేవారు.
కుటుంబ నేపథ్యం..
గురుస్వామి గారికి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మొదటి కొడుకు రవికుమార్ స్కందాన్షి ఇన్ఫ్రా ప్రాజెక్టు (కర్నూలు)లో ఏపీఎం. కోడలు భారతి. రెండో కుమారుడు చంద్రశేఖర్ హర్ష్కో ఎన్విరాన్మెంటర్ ( జేఎస్డబ్ల్యూ స్టీల్స్, బళ్లారి)లో టీమ్ హెడ్. వీరి భార్య శైలజ. మొదటి కూతురు పేరు గీతావాణి. అల్లుడు పి. సుబ్రహ్మణ్యం. ఇన్ఫోర్స్ లాజిస్టిక్స్ సోల్యూషన్స్ (పూణే)లో సీఈవో. రెండో కూతురు మాధవీలత. అల్లుడు డా।। పి. ఎస్. వి. రామాంజనేయులు, ప్రభుత్వ అధికారి.
‘మా తండ్రిగారు మొదటి నుంచి విద్యారంగంలో ఉన్నారు. పద్మశాలీ విద్యార్థులను సంఘంలో ఉన్నత స్థాయిలో చూడాలనుకునేవారు. వారికి కులస్థులు అండగా నిలిచి ప్రోత్సహించాలని పరితపించేవారు. పద్మశాలీ హాస్టల్కు పూర్వ వైభవం తేవాలన్నది ఆయన చిరకాల కోరిక’.
– కుటుంబసభ్యులు
పద్మశాలీ ప్రముఖులందరికి సుపరిచితులే..
పోపా వ్యవస్థాపకులు సింగరి శ్రీరంగం, రిటైర్డ్ లెక్చరర్ దివంగత కాల్వ సంజీవరాయుడు, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ చెన్నా ఆంజనేయులు, రిటైర్డ్ ఎస్బీఐ మేనేజర్, మాజీ అధ్యక్షులు ఏలే నర్సయ్య, ట్రాన్స్కో రిటైర్డ్ డీఈ, మాజీ అధ్యక్షులు పి. వెంకటేశ్వర్లు, రిటైర్డ్ లెక్చరర్ ధన్వంతరి, మాజీ అధ్యక్షులు కడప నాగభూషణం గురుస్వామికి సుపరిచితులు. నవంబర్ 15, 2020న తుదిశ్వాస విడిచారు. పలువురు పద్మశాలీ ప్రముఖులు, కులస్థులు గురుస్వామి గారికి నివాళి అర్పించి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.
25న వైకుంఠ సమారాధన
కర్నూలు శ్రీనగర్ కాలనీలోని ఇంటి నెం. 87/554లో నవంబర్ 25వ తేది మధ్యాహ్నం 12 గంటలకు వైకుంఠ సమారాధనను కుటుంబసభ్యులు (94909 05218, 94904 83268) నిర్వహిస్తున్నారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Kärna Fintrix
