తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో పనిచేయడం ఎన్నోజన్మల పుణ్యఫలమని, శ్రీవారి భక్తుల సేవలో తరించడం తనకు సంతృప్తినిచ్చిందని ఈవో జంజనం శ్యామల రావు (పద్మశాలి) అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు ఆలయ పరిపాలనా భవనంలో మంగళవారం సాయంత్రం (సెప్టెంబర్ 9న) సిబ్బంది సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీటీడీ అంటే మినీ గవర్నమెంట్ లాంటిదని, తనకు నిత్యం పనిచేయడం మాత్రమే తెలుసునని, ప్రచారం చేసుకోవడం తక్కువ అని చెప్పారు. భక్తులు స్వయంగా తమకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంపై ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగుల సమష్టి కృషితో భక్తులకు మెరుగైన సేవలు అందించడం సంతృప్తిగా ఉందన్నారు. ఐఏఎస్లకు టీటీడీ ఈవోగా చేయాలని ఉంటుందని, తనకు ఆ కోరిక తీరిందన్నారు. తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడు, సహకరించిన ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ సీవిఎస్వీ మురళీకృష్ణ, ఎఫ్ఏ సీఏవో బాలాజీ, సీఈ టీవీ సత్యనారాయణ మాట్లాడారు. Duneriat


