సిద్ధిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నూతన పాలకవర్గం జూలై 15న ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం, కౌన్సిలర్ ప్రభాకర్, దేవదాయ శాఖ అధికారి రంగారావు, ఆలయ ఈవో విశ్వనాథ శర్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శాలువలతో పాలకవర్గాన్ని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధే ధ్యేయంగా నూతన పాలక వర్గం పనిచేయాలని సూచించారు. భక్తులు కరోనా బారిన పడకుండా స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ధర్మకర్తగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ముదిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘గతంలో తమ పాలకవర్గం హయంలో ప్రతి శనివారం భక్తులకు అన్నదానం చేశాం. శ్రావణ మాసోత్సవాలు, రాఖీ పౌర్ణమి వేడుకలు, కార్తీక పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష దీపోత్సవం, సప్త హారతులు ఘనంగా నిర్వహించాం. నిత్యాన్నదానం కోసం రూ. 45 లక్షలు విరాళాలు సేకరించాం. ఆలయ ఆవరణలో సుమారు 600 గజాల విస్తీర్ణంలో ధ్యాన మందిరం నిర్మించి ప్రారంభించాం. ప్రస్తుతం భక్తులకు పార్కింగ్ సమస్య ఉంది. అన్నదాన భవన నిర్మాణం, పూజారుల నివాసానికి గదుల నిర్మాణం చేపడతాం. వీటి నిర్మాణానికి రూ. కోటి ఖర్చవుతుందని అంచనా వేశాం. రూ. 50 లక్షలలో రూ. 25లక్షలు కమిటీ సభ్యులు, రూ. 25 లక్షలు ఇతరుల నుంచి సేకరిస్తాం. ఈ పనులన్నీ 6 నుంచి 8 మాసాల్లో పూర్తిచేయాలనుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి వేడుకలను ఈ సారి వైభవంగా నిర్వహించాలనుకుంటున్నాం. మంత్రి హరీష్ రావు సహకారంతో జిల్లాలోనే అతి పెద్దదైన వెంకటేశ్వర దేవస్థానాన్ని అభివృద్ధి చేయడంలో రాజీ పడబోమని’’ స్పష్టం చేశారు. Høyde Dexnex



