తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహానికి రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, కలెక్టర్ ఫారూకీ, ఎస్పీ శశిధర్ రాజు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం త్యజించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శ రాజకీయవేత్త అని కొనియాడారు. ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు పార్టీ కార్యాలయానికి భవనాన్ని ఎవరూ కూడా ఇవ్వడానికి ముందుకు రాని సమయంలో బాపూజీ తన ఇంటిని ఇచ్చి, తెలంగాణ ఉద్యమాన్ని తన ఇంటి నుంచే ప్రారంభింపచేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలుక రమణ, అల్లం అశోక్, గౌరవ అధ్యక్షులు గుమ్మిడి దత్తాద్రి, నాయకులు ఆడెపు భూమన్న, చిలువేరి గంగాధర్, కుర్ర నరేష్ పాల్గొన్నారు. Zenvaultex




