దేశ సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును భారత సైనికులు ఎప్పటికప్పుడు పసిగడుతూ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా దేశ ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారు. వారి రుణం తీర్చుకోలేనిది. సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఇటీవల ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లద్దాక్లో పర్యటించి సైనికాధికారులతో పరిస్థితులను సమీక్షించారు. సైనికుల వీరోచితాన్ని ప్రశంసిస్తూ.. రక్షా బంధన్ సందర్భంగా కర్నూలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక తమ బుట్టా ఫౌండేషన్ తరుపున వారికి రాఖీలు పంపాలని నిర్ణయించారు. వాటిని జూలై 27వ తేది సోమా ఆర్కేడ్ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంత పద్మశాలీ సంఘం (అడ్హక్) చైర్మన్ కొంకతి లక్ష్మీనారాయణ, కర్నూలు పద్మశాలీ పట్టణ సంఘం కోశాధికారి, అనుటైక్స్ అధినేత కాంచానం బాలాజీ మాట్లాడుతూ సోదర భావానికి ప్రతీకగా కార్గిల్,గల్వాన్ లోయ, సియాచిన్లో పహారా కాస్తున్న సైనికులకు బుట్టా రేణుక రాఖీలు పంపడం అభినందనీయమన్నారు. బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ బుట్టా రేణుక ఎంపీగా ఉన్న సమయంలో ప్రతి నెల సైనిక సంక్షేమం కోసం నిధులు పంపేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ కో ఆర్డినేటర్ చరిత, హేమలత, కుర్ని యువసేన నాయకులు మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

