రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో బలపడేందుకు ఆంధప్రదేశ్ వీవర్స్ ఎంప్లాయిస్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఏపీ వెపా) అడ్హక్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా అధ్యక్షులు సజ్బా వెంకట సురేష్ తెలిపారు. ఈ బృహత్కార్యాన్ని డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 7గంటలకు నెల్లూరు రూరల్ నియోజక వర్గ స్థాయి వీడియో కాన్ఫరెన్స్ వెంకట సురేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ కాన్ఫరెన్సుకు ముఖ్య అతిథిగా హాజరయిన వెపా రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట శేషయ్య మాట్లాడుతూ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వెపా సంఘాల ఏర్పాటు ఇతర రాష్ట్రాల్లోని సంఘాలకు ఆదర్శంగా నిలుస్తుందని, ఈ ఏర్పాటు ఆలోచన ఏ ఒక్కరిది కాదని, అందరి ఆలోచన అని వివరించారు.
మరో ముఖ్య అతిథి, చేనేత కవి రాపోలు జగన్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో చేనేత సమాజం సమావేశాలు నిర్వహించి, వాటికి స్థానిక శాసన సభ్యులను ఆహ్వానించడం ద్వారా మన బలం, ఐక్యతను వారికి చూపినట్లవుతుందన్నారు.
వెపా సభ్యులు మురళి మాట్లాడుతూ తాను చేనేత సమాజం కోసం ఒక బ్లాగర్, ఫేస్బుక్,ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించానని తెలిపారు. మరో సభ్యులు కృష్ణకిషోర్ మాట్లాడుతూ చేనేత సమాజానికి తన వంతుగా సాంకేతికపరమైన సేవలందిస్తానని పేర్కొన్నారు.
అనంతరం నెల్లూరు రూరల్ నియోజక వర్గ అడ్హక్ తాత్కాలిక కమిటీని సజ్జా వెంకటసురేష్ ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా మువ్వల దశరథ రామయ్య, అధ్యక్షులుగా మద్దూరి తిరపతయ్య, అసోసియేట్ అధ్యక్షులుగా వుక్కా శేషయ్య, ప్రధాన కార్యదర్శిగా తుమ్మలచెర్ల వెంకటేశ్వర్లు,సంయుక్త కార్యదర్శిగా మోపూరు చంద్ర శేఖరం, కోశాధికారిగా వీర శివ ప్రసాద్, మహిళా కార్యదర్శిగా ఎం.రమ్యను నియమించారు. వీరితో పాటుగా బొమ్మన రమణయ్య, మంచా సుబ్రహ్మణ్యం, కోలాటి రాజేష్, దండే వెంకటరావు, కోటేశ్వరరావు,అవ్వారు శ్రీధర్ బాబు, గుంటి కృష్ణ కిషోర్, దండే ఓబయ్య, దువ్వూరు ధనుంజయ, ఇమ్మడి చందు కమిటీకి సహాయక కార్యదర్శులుగా వ్యవహరిస్తారని తెలిపారు. తమకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని కొత్త కార్యవర్గం పేర్కొంది. వెంకటశేషయ్య నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ వారికి దిశా నిర్ధేశం చేశారు. రాత్రి 9.30 తాటిపర్తి వెంకటేశ్వర్లు వందన సమర్పణతో కాన్ఫరెన్స్ ముగిసింది. Cesta Evocorex

