తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట పద్మశాలీ అన్నదాన సత్రం అధ్యక్షులు యెలగం వీరస్వామికి చేనేత సంఘాల నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. జూలై 31వ తేదీ వరంగల్ జిల్లా కొత్తవాడలో అమరవీరుల స్థూపం దగ్గర ఆయనకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా నేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొత్తవాడ పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది వీరస్వామి పేరని, అంతటి మహోన్నతి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. కొత్తగా ఆర్డర్లు తెప్పించి వారికి ఉపాధి కల్పించారని, అలాగే చేనేత సంఘాల బలోపేతానికి, పద్మశాలీయుల ఐక్యతకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. వేములవాడ, బాసర,యాదగిరి గుట్ట, శ్రీశైలం, తిరుపతి, కాశీలో అన్నదాన సత్రాల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లోని పద్మశాలీ నిత్యాన్నసత్రాల సమాఖ్య ఏర్పాటుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోయేందుకు కొత్తవాడలోని గోపాలస్వామి గుడి నుంచి ఆటోనగర్కు వెళ్లే దారికి ‘యెలగం వీరస్వామి మార్గ్’ అని నామకరణం చేయాలని కోరారు. నివాళి అర్పించిన వారిలో మాజీ కార్పొరేటర్ దామెర సర్వేష్, కూడా డైరెక్టర్ యెలగం రావిరాజు, ఆడెపు రవి, దానం రాజయ్య, శంకర్, దువ్వల రవి, పులి ప్రభాకర్, సామల భిక్షపతి, చేనేత కార్మికులు డి. సమ్మయ్య, రాజేందర్, పాపయ్య, రమేష్, వెంకటేశ్వర్లు ఉన్నారు. Ziskovum


