
బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరానికి సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మున్సిపల్ మెమోరియల్ హై స్కూల్ (జోహరాపురం) విద్యార్థులకు గణితం, ఆంగ్లంలో మెలకువలు నేర్పారు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారికి 15 రోజుల పాటు గణితంలో ఫార్ములాలు, ఇంగ్లీషు గ్రామర్ బోధించారు. శిక్షణ ముగింపు రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదని ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ సలాం, ప్రధానోపాధ్యాయిని నసీమా పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ చిన్నపుడు తాను గణితం అంటే భయపడేవాడినని పేర్కొన్నారు. బుట్టా ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో శిక్షణ ఇప్పించడం అభినందనీయమన్నారు. మైనారిటీ నాయకులు రోషన్ అలీ మాట్లాడుతూ చదువులో వెనకబడి ఉన్న విద్యార్థులకు ఇలాంటి శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రెవెన్యూశాఖ రిటైర్డ్ ఆఫీసర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాల్లో బుట్టా ఫౌండేషన్ చురుగ్గా పాల్గొంటుందని, ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించాలని కోరారు. బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆధ్వరంలో పనిచేస్తోన్న బుట్టా ఫౌండేషన్ పేద, ప్రతిభ చాటిన విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, యువతకు నైపుణ్యంలో శిక్షణ ఇప్పించడం, చేనేతల సంక్షేమానికి కృషి చేస్తోందని వివరించారు.కార్యక్రమం చివరలో శిక్షణలో ప్రతిభ చాటిన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ సభ్యులు చరిత, హేమలత, వసీం, లోకేష్ పాల్గొన్నారు. Kuu Arvostus
