కోవిడ్ -19 కారణంగా చేనేత రంగం సంక్షోభంలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు మార్చి నుంచి ఈ యేడాది చివరి వరకు కనీస జీవన భృతి చెల్లించాలని రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ డిమాండ్ చేశారు. తమను ఆదుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు, మోత్కూరు, చౌటుప్పలా, బోధాన్ పోచంపల్లి మండల కేంద్రాల్లో చేనేత కార్మికులు గత కొన్ని రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలకు ఆనంద భాస్కర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేనంతగా నేత కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఆదుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా చేనేత కార్మికులు రిలే దీక్షలకు పూనుకున్నారని, అందులో భాగంగా మోత్కూరులో చేపట్టిన దీక్ష జూలై 26 నాటికి పదవరోజు చేరుకుందన్నారు. వచ్చే మూడేళ్లకు త్రిఫ్ట్ పంఢ్ను ప్రకటించాలన్నారు. ఖాతాలో జమ అయిన డబ్బుతో సంబంధం లేకుండా 36 మాసాలకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తాన్ని చేనేత కార్మికుల ఖాతాలో జమచేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు తయారు చేసి లాక్డౌన్ వల్ల వారి వద్దనే ఉండిపోయిన వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులకు ఇచ్చే కిట్లు, షాదీ ముబారక్, కళ్యాణి లక్ష్మీ పథకాల్లో చేనేత వస్త్రాలను వినియోగించుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం భువనగిరి జిల్లా అధ్యక్షులు చిక్కా వెంకటేశ్వర్లు, కార్య నిర్వాహక అధ్యక్షులు చిరందాసు ధనుంజయ, ప్రధాన కార్యదర్శి రాపోలు వీరమోహన్ పాల్గొన్నారు.
పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో..
పోచంపల్లిలో చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షలకు రాపోలు ఆనంద భాస్కర్ సంఘీభావం తెలిపారు. చేనేత, నేత కార్మికుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతరం దీక్షను విరమింపజేశారు. రాపోలు వెంట మిర్యాలగూడ పట్టణ పద్మశాలీ సంఘం తరుపున మారం శ్రీనివాస్, (ఆర్ఎస్ఎస్) యామిని వెంకటేశ్వర్లు, జెల్లా సత్యనారాయణ, మిర్యాలగూడ నియోజకవర్గం పద్మశాలీ సంఘం కన్వీనర్ పున్న రాములు, కార్యనిర్వాహక అధ్యక్షులు రాపోలు వెంకటేశ్వర్లు ఉన్నారు. Immediate Edge



