హైదరాబాద్ : చేనేతల బలవన్మరణాల నివారణ, నేత కార్మికుల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా.. జూన్ 30వ తేదీన (ఆదివారం) అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని స్వకుల శాలి భవన్ ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా పద్మశాలి ప్రముఖులు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పద్మశాలి సంఘాల నేతలు, చేనేత కార్మిక సంఘాల నాయకులు, వివిధ హోదాలలో ఉన్న పద్మశాలి అధికారులు సమావేశానికి విచ్చేసి చేనేత పరిశ్రమ సంరక్షణ, చేనేతల ఆత్మహత్యల నివారణకు సూచనలు సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రండి..పాలకులను ప్రశ్నిద్దాం..
‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేనేతల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. బతుకమ్మ చీరల తయారీ తరువాత పనులు లేక పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. మాస్టర్స్ వీవర్స్ వద్ద నేతన్నలకు పని కరువైంది. ఉత్పత్తి చేసిన వస్త్రాలను సర్కారు కొనడం లేదు. గతంలో కొన్న సరుకుకు డబ్బులు ఇంకా చెల్లించాల్సి ఉంది. అర్హులకు పింఛన్లు మంజూరు కావడం లేదు. మంజూరయిన వారికి ఫించన్ డబ్బు సరిగా అందడం లేదు. నేత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కుటుంబాలు నెట్టుకురావడం తలకు మించిన భారమైంది. పనులు లేక చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక తనువు చాలించాల్సి రావడం దురదృష్టకరం. ఇకనైనా మనం మేల్కోవాలి. పాలకులను నిద్ర లేపాలి. చేనేతల ఆత్మహత్యలకు ముగింపు పలకాలి. బలవన్మరణాల నివారణకు అఖిల పక్ష సమావేశం ఏర్పడాలి. చేనేతల సమస్యలన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. వాటి పరిష్కారానికి ఒత్తిడి తేవాలి. అందుకు మీ అందరి సహాయసహకారాలు కావాలి. త్వరలో ఏర్పాటుచేయబోయే అఖిల పక్ష సమావేశానికి మీ విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలని వినమ్రంగా కోరుతున్నా..’’
మీ..
-రాపోలు వీర మోహన్, అధ్యక్షులు
తెలంగాణ చేనేత ఐక్య వేదిక, హైదరాబాద్
సెల్: 98664 77255 Bitradex Polska

