దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 15 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) నోటిఫికేషన్ కోసం తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయస్సు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తమ వెబ్సైట్ https://kvsangathan.nic.in/ను సందర్శించాలని సూచించింది.
కేవీల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్ లిస్ట్ను ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న విడుదల చేయనున్నట్టు KVS ఓ ప్రకటనలో పేర్కొంది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇకపోతే, రెండు, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు. 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. కేవీ విద్యార్థుల ఎంపిక పూర్తయిన తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే సీటు ఇవ్వబోమని కేవీఎస్ స్పష్టం చేసింది. పూర్తి షెడ్యూల్ను ఈ కింది పీడీఎఫ్లో చూడొచ్చు.


